జ్యూరిచ్: ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడి తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయింది. సీఎం చంద్రబాబు ఏం చెబుతారోనని వచ్చిన వ్యాపారవేత్తలు, యూరఫ్ ఎన్నారై టీడీపీ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదన్నారు. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే జ్యూరిచ్ లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా..? అర్థం కావడం లేదని హర్షం వ్యక్తం చేసారు.

ఆనాడు ఆయన విజన్ 2020 అంటే ఎంతో మంది ఎగతాళి చేశారు. కానీ ఇవాళ హైదరాబాద్ ను చూస్తే.. ఆయన ఆనాడు చెప్పిన ప్రతీ మాట నిజమని నమ్మాల్సిందే. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చాలా కృషి చేశారు. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి చంద్రబాబు.. ఆయన చేతిలో ఫైళ్లు పట్టుకొని న్యూయార్క్ వీధుల్లో తిరిగారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాలుంటాయి. ఆయనను అరెస్ట్ చేసిన సమయం నా జీవితంలో అత్యంత కష్టమైన సమయం. కానీ ఆయన మాత్రం భయపడలేదు. ఆ సమయంలో కూడా ప్రజల గురించే ఆలోచించారని నారా లోకేష్ తెలిపారు.
ఏపీ రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలుచేయడమేగాక దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రోత్సహకాలను అందజేస్తోందని చెప్పారు. పూర్తిస్థాయి బ్లూప్రింట్ తో వస్తే 15 రోజుల్లో ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు.