శ్రీశైల మహా క్షేత్రం పుష్యమాస శుద్ధ ఏకాదశి సందర్భంగా ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శాస్త్రోక్త పూజలు నిర్వహించారు.ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, అక్కమహాదేవి అలంకార మండపంలో సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు.ఈ పుష్పార్చనలో 40 రకాల రంగురంగుల పుష్పాలు, నాలుగు వేల కేజీల పూలతో ఆది దంపతులను అర్చించారు.నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం పుష్యశుద్ధ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పుష్పార్చన జరిపారు.సాయంత్రం 6 గంటలకు అక్కమహాదేవి అలంకారమండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చన నిర్వహించారు.

పుష్పకైంకర్యంలో గులాబి, చేమంతి, సుగంధాలు, నూరువరహాలు, కాగడా మల్లెలు, సన్నజాజులు, విరజాజులు, గన్నేరు, కనకాంబరం, సంపంగి, తామర మొదలైన పుష్పాలు, బిల్వం, దవనం, మరువం మొదలైన పత్రాలతో స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజాదికాలు నిర్వహించారు.సుమారు 4 వేల కేజీల పుష్పాలు ఈ పుష్పార్చనకు వినియోగించబడ్డాయి.మొత్తం 40 రకాల పుష్పాలతో ఈ పుష్పార్చన జరిపారు.దేవస్థాన వేదపండితులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది వేదపండితులచే చతుర్వేద పారాయణలు జరిపారు.
అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణలు, లలితాసహస్రనామ పారాయణలు కూడా జరిపారు.జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారు పుష్పప్రియుడని ప్రతీతీ మల్లికాపుష్పాలతో పూజింపబడిన కారణంగానే స్వామివారికి మల్లికార్జునుడనే పేరు ఏర్పడిందని చెప్పారు.మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవి వారికి కూడా పుష్పార్చన ప్రీతికరమని చెప్పబడిందని ఈ కారణంగానే లోకకల్యాణం కోసం పుష్యశుద్ధ ఏకాదశిన స్వామి అమ్మవార్లకు పుష్పార్చన జరిపించామని శ్రీశైల ఈవో ఎం.
శ్రీనివాసరావు తెలిపారు.పుష్పకైంకర్యానికి అవసరమైన పుష్పాలన్నింటిని పుంగనూరుకు చెందిన రామచంద్రయాదవ్ పూర్తి విరాళంగా సమర్పించారు.ఈ కార్యక్రమంలో అర్చకస్వాములు, వేదపండితులు, పుష్పవిరాళాన్ని అందజేసిన రామచంద్రయాదవ్, దేవస్థాన వివిధ శాఖల అధిపతులు, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.