వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. పదవి కాలం ఇంకా మూడేళ్ల వరకూ ఉన్నా హఠాత్తుగా ఎందుకు పదవులు వదులుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు చేసే రాజీనామాల వల్ల ఆ పదవులన్నీ కూటమికే దక్కుతాయి కానీ వైసీపీ ఖాతాలో పడే అవకాశం లేదు. ఇప్పటికే వైసీపీ నుంచి ముగ్గురు రాజీనామా చేశారు. ఆ ముగ్గురిలో ఇద్దరు బీజేపీలో చేరి మళ్లీ ఎంపీలయ్యారు. మరొకరు టీడీపీలో చేరినా రాజ్యసభ సీటు వద్దనుకున్నారు.
దాంతో ఆ సీటును సానా సతీష్ కు ఇచ్చారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి, రాజీనామా చేస్తే ఆ సీటు ఖచ్చితంగా కూటమి ఖాతాలోకి పోతుంది. అయినా ఆయన రాజీనామా చేస్తున్నారంటే.. అంతర్గతం తీసుకున్న నిర్ణయం మేరకు తీసుకున్నారని అనుకోవచ్చు. అదే నిజమైతే.. ఒకరిద్దరు తప్ప వైసీపీకి కొందరు ఎంపీలు రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాలుగైదు నెలల తరవాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన అలా వెళ్లడం ఆలస్యం ఇటు.. ఒక్క కనకమేడల రవీంద్ర తప్ప మిగతా రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో విలీనమయ్యారు. వారు ఆషామాషీ వ్యక్తులు కాదు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు అయిన సుజనా చౌదరి,సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి వాళ్లు. వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపించారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. జగన్ కూడా పలుమార్లు అదే చెప్పారు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది.

జగన్ లండన్ టూర్లో రాజీనామా
వైఎస్ జగన్ కుమార్తె గ్రాడ్యూయేషన్ కోసం లండన్ వెళ్లారు. విజయసాయిరెడ్డి హఠాత్తుగా రాజీనామా ప్రకటించారు. జగన్ తో మాట్లాడకుండా విజయసాయిరెడ్డి రాజీనామాలు చేసే అవకాశాలు లేవు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. అయితే తాను ఏ పార్టీలోనూ చేరనని వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్కు కృతజ్ఞతలు చెప్పారు అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ, అమిత్ షాల పేర్లను కూడా ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.