తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ ఆదాయంతోనే ప్రభుత్వాలు తమ మనుగడకు సాగించేలా వున్నాయి. తాజాగా తెలంగాణలో మద్యం ధరల పెంపుకు రంగం సిద్దమైంది. ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. ధరల పెంపు పైన ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే, ధరల పెంపు పైన లిక్కర్ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడితో తాజాగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ప్రభుత్వ కమిటీ.. అధికారుల ప్రతిపాదనల పైన అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. ధరల పెంపు పైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొంత కాలంగా మద్యం ధరల పెంపు పైన చర్చ సాగుతోంది. అయితే, ప్రభుత్వం ఈ విషయంలో గతంలోనే స్పష్టత ఇచ్చింది. కొన్నేళ్లుగా మద్యం ధరలు పెంచకపోవటంతో.. తయారీ కంపెనీలు పెంపు కోసం ఒత్తిడి పెంచాయి. మద్యం ధరల పెంపు పైన అధ్యయనం.. సిఫార్సుల కోసం ప్రభుత్వం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 18న తొలిసారి సమావేశమైంది. జూలై 25లోగా మద్యం కంపెనీలు సరఫరాకు ధరలు కోట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది.

కంపెనీల నుంచి వచ్చిన సీల్డ్ కవర్లను ఓపెన్ చేసి ధరలను పరిశీలన చేసింది. 91 కంపెనీలు ఆ సమయంలో ముందుకు వచ్చాయి. రాష్ట్రంలో గత నాలుగేళ్ల కాలంలో మద్యం ధరలు పెరగలేదు. తాజాగా యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్ తమ ఉత్పత్తుల పైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి లేఖ ద్వారా తమ నిర్ణయం వెల్లడించింది. ఇక, తాజాగా మద్యం ధరల పెంపు అంశం పైన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. కమిటీ నివేదిక ప్రకారమే నిర్ణయాలు ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. కాగా, ధరల పెంపు తప్పదని అధికారుల అంచనా.