పార్లమెంటు ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ ఘటనకు సంబంధించి.. ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని ప్రశ్నించనున్నట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎంపీల మధ్య తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడటం, రాహుల్గాంధీపై పార్లమెంటు స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేయటం తెలిసిన విషయమే. దీనిపై రాహుల్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. దీంట్లో భాగంగానే ప్రతిపక్షనేతను ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఒకరిపై ఒకరు కేసులు
ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. కాగా, రాహుల్పై నమోదైన కేసు ఢిల్లీ క్రైం బ్రాంచ్కు బదిలీ అయింది. ఇదే ఘటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గాయపడటంపై ఆ పార్టీ నేతలు బీజేపీ ఎంపీలపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోపులాట ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులను పరిశీలించటానికి అనుమతించాలని పార్లమెంటు సెక్రటేరియట్ను పోలీసులు కోరే అవకాశం ఉందని తెలిసింది. కాగా, పార్లమెంటు ఘటన సందర్భంగా రాహుల్ తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నాన్ కొన్యాక్ ఆరోపించిన నేపథ్యంలో మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరింది. ఈ సంఘటనతో పార్లమెంట్ లో మరింత కట్టుదిట్టమైన భద్రతను పెంచారు.
