విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత కుటుంబాలు బతుకుదెరువు కోసం విశాఖపట్నానికి వలస వచ్చి షీలానగర్లోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాయి. సుష్మిత, దుర్గారావు మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు కలిసి జీవితం గడపాలని నిర్ణయించుకున్నప్పటికీ, వారి ఇళ్లలో పెళ్లి విషయంపై ప్రస్తావన తీసుకురాగా కుటుంబాల నుంచి నిరాకరణ ఎదురైంది. ఈ నిరాకరణ వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.
ఈ క్రమంలో వారిద్దరూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవించే అవకాశం లేదని..కలిసి చనిపోదామని చెప్పి ఓ అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కిరెడ్డిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు కుటుంబ సభ్యుల మధ్య ఉత్పన్నమైన ఒత్తిళ్లు కారణమా లేదా ఇతర కారణాలా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.