తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోడి పందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటితోపాటు గుండాట, లోన బయట, పేకాటలు కూడా పందెంరాయుళ్లను ఖుషీ చేయనున్నాయి. మందు-విందు-చిందు వంటి ప్రత్యేక ఏర్పాట్లతో కోస్తా సహా పలు జిల్లాల్లో కోడి పందేల బరులు ఈ దఫా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగమైన కోడి పందేలు ప్రతి ఏడాదిలాగానే ఈ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెట్టపీట వేస్తూ పల్లెల్లో సంక్రాంతి సంబరాలు చిత్రం ఏంటంటే.. ఈ ‘సంస్కృతి’లో తరతమ భేదాలు కానీ, రాజకీయ విభేదాలు కానీ లేకుండా అందరూ చేతులు కలపడమే!!

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అంపాపురం బరిని రూ.3 కోట్లకు ఓ పార్టీ నాయకులు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు ఇక్కడ కోడిపందేలతో పాటు పేకాట, గుండాట, కోత ముక్కాట, లోనబయట నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. మద్యం విక్రయాలకు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలోని అంబాపురం, జక్కంపూడిలోని పాములకాల్వ ప్రాంతాల్లో బరులను ఏర్పాటు చేయడానికి ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరులు సిద్ధమయ్యారు.
తెలంగాణకు సరిహద్దు గ్రామాలుగా ఉన్న గరికిపాడు, బూదవాడ, తొర్రగుంటపాలెం, తిరుమలగిరి, జగ్గయ్యపేటలో బరులు సిద్ధం చేశారు. పెనుగంచిప్రోలు, కంచికచర్లలో హైటెక్ జూదం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ నడిబొడ్డున ఉండే రామవరప్పాడులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసం ఉండే ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ చెంతనే ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. విజయవాడలోని పటమటలంకలో భోగి నుంచి కనుమ వరకు పందేలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ వేళ బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేసిన బరుల్లో కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారు. కోడి పందేలు ఒక రోజు ముందే అంటే ఆదివారమే ప్రారంభమయ్యాయి. ఇక, పేకాట మాత్రం గడచిన రెండు రోజుల నుంచి రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధిలో జోరుగా సాగుతోంది.