తెలుగు భాష కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన భాషను మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగులో మాట్లాడని వారికి ఓటేయొద్దని, తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ వర్సిటీ వేదికగా జరుగుతున్న రెండవ ప్రపంచ మహాసభల్లో ఆయన మాట్లాడారు.

తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినదే కాదని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగాలని, సినిమా సంబషణలు తెలుగులో ఉండాలని అన్నారు. ఆంగ్లంలో మాట్లాడకపోతే నామోషీ అన్న భావన సరికాదని పేర్కొన్నారు.
అమ్మ భాషను మరిచిపోతే అమ్మను కూడా మరిచిపోయినట్టేనని తెలిపారు. ఇంగ్లిష్ భాష వాడుతూ తెలుగు భాషను దిగజారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగు మాట్లాడుతున్నారని, మన భాషను మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామని ప్రశ్నించారు.