తిరుమలలో భద్రతా వైఫల్యంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తోంది. తిరుమలకు చేరుకునే ముందు అలిపిరి వద్దే భద్రతా సిబ్బంది అన్ని వాహనాలను నిలిపివేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాహనంలో అనుమానంగా ఏమైనా ఉన్నా, నిషేధిత వస్తువులు ఉన్నా వాటిని తొలగించిన తర్వాతే తిరుమల కొండపైకి ఆ వాహనాలను అనుమతిస్తుంటారు. కానీ తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు చేసిన నిర్వాకంతో తిరుమల భద్రతలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. తిరుమలలో మాంసాహారం నిషేధం వున్నదని అందరికి తెలిసిందే. కానీ తమిళనాడుకు చెందిన భక్తులు ఏకంగా తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ భక్తులు.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి నిషేధిత ఆహారంతో కొండకు వచ్చారా?.. లేక భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వ్యవహరించారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి తమిళనాడు భక్తులు చేసిన పనికి తిరుమల భద్రతా సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. అయితే నిషేధిత తినుబండారాలతో తిరుమలకు చేరుకున్నారు ఆ భక్తులు. కోడి గుడ్లు, పలావ్తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు భక్త బృందం. అలిపిరి టోల్ ప్లాజాలో సెక్యూరిటీ తనిఖీ దాటుకొని నిషేధిత ఆహార పదార్థాలతో భక్త బృందం తిరుమలకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాంభగిచ్చ బస్టాండ్ ఆవరణలో కొందరు భక్తులు కోడిగుడ్డు, పలావ్ తినడాన్ని గుర్తించిన ఇతర భక్తులు.. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకొన్న పోలీసులు.. భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధమని భక్త బృందాన్ని పోలీసులు మందలించారు. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతలోని డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు.