దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు ఆవహించడంతో వాహనదారులు తంటాలుపడుతున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. పొగమంచు వల్ల ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి తోడు పొగమంచు రాజధాని వాసులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 7.6 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితి.

80కిపైగా విమాన సర్వీసులకు అంతరాయం
సాధారణంగా రన్వే విజిబిలిటీ 200 నుంచి 500 మీటర్ల మధ్య ఉంటుంది. అయితే, సాధారణ దృశ్యమానత ఇవాళ ఉదయం సున్నాకు పడిపోయింది. దీంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు 80కిపైగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. ఫ్లైట్రాడార్24 ప్రకారం.. కనీసం 80 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ ఐదు విమానాలు రద్దయ్యాయి. దీంతో విజిబిలిటీ దాదాపు సున్నాకి పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచుతో పాటు కాలుష్యం కూడా పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు.