సంక్రాంతి కనుమ సందర్బంగా తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. కనుమ రోజున పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందాల శిబిరాల్లో లక్షల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారు 100 నుంచి 120 గ్రామాల్లో 300 కు పైగా బరులు ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల వరకు పందాలు, గుండాట జరిగినట్టు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ పందాలు, జూదం జరిగినట్టు సమాచారం. మురమళ్ళలో వీఐపీలో బరి రూ.60 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పందాలు జరిగినట్టు అంచనా. కొన్ని చోట్ల విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేస్తున్నారు. ఆత్రేయపురంలో విజేతలకు బుల్లెట్లను బహుమతులు అందజేశారు.
ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు
అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు మూడో రోజుకు చేరుకున్నాయి. పందాలకు ఈరోజు వరకు అనుమతి ఉంది. సాయంత్రం నుంచి పందాలకు అనుమతి లేదంటూ ప్రచారం జరుగుతోంది. రెండు రోజులుగా సాగుతున్న కోడిపందాల్లో రూ.300 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. కోడిపందాల ముసుగులో యధేచ్ఛగా పేకాట, గుండాట జరుగుతున్నాయి. ప్రతీ కోడి పందెం శిబిరం వద్ద మద్యం బెల్ట్ షాపులు కూడా వెలిశాయి.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సాంప్రదాయ ముసుగులో భారీ ఎత్తున జూద క్రీడలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం టెర్మినల్లో జూద క్రీడలు క్యాసినోను తలపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లో హైదరాబాద్కు చెందిన ఆర్ఆర్ గ్రూప్ సంస్థ జూద క్రీడలు నిర్వహిస్తోంది. బౌన్సర్లను పెట్టి మరీ ఆర్ఆర్ గ్రూప్ సంస్థ పేకాట శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఇబ్రహీంపట్నంకు హైదరాబాద్ కల్చర్ను పరిచయం చేసింది. ఇంత జరుగుతున్నప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. భారీ ఎత్తున ముడుపులు చెల్లింపులు జరిగినట్లు సమాచారం.