ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తన నియోజకవర్గంలో కోడి పందాల్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత సొంత నియోజకవర్గం ఉండిలో ఆయన భోగి వేడుకలు నిర్వహించారు. అంతే కాదు సంక్రాంతి సందర్భంగా జరిగే సంప్రదాయ కోడి పందాల్లోనూ పాల్గొన్నారు. సహ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురిని తన నియోజకవర్గానికి ఆహ్వానించి మరీ సంబరాల్లో భాగస్వాముల్ని చేస్తున్నారు.

ప్రతీ ఏటా సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కోడి పందాలు జరుగుతాయి. అయితే సంప్రదాయ కోడి పందాలకు గతంలో సుప్రీం కోర్టు వరకూ వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు.. ఇవాళ తన నియోజకవర్గంలో కోడి పందాల్ని ప్రారంభించారు. తన కోడితో గంటా శ్రీనివాస్ పుంజుతో ఈ పోటీని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరం గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో వీటిని నిర్వహిస్తున్నారు.కోళ్లకు కత్తులు లేకుండా జరుగుతున్న డింకీ పందాల్లో భాగంగా ఇలా రఘురామ పాల్గొన్నారు.
జూదం లేకుండా కోళ్లకు కత్తులు కట్టకుండా సంప్రదాయ కోడి పందాలు నిర్వహించడం రఘురామకు ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గతంలోనూ ఆయన వరుసగా కోడి పందాలు నిర్వహించడం, పాల్గొనడం చేసే వారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం రఘురామను పూర్తిగా టార్గెట్ చేయడంతో కోడి పందాలకు, సంక్రాంతి వేడుకలకు, సొంత నియోజకవర్గానికి కూడా ఆయన దూరమయ్యారు. కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు రఘురామకు తిరిగి స్వేచ్ఛ లభించింది.