రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన… దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన… దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రైతును డిక్లరేషన్ ఎందుకు?
రైతుల నుంచి ప్రభుత్వం డిక్లరేషన్ కోరడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదని… ప్రభుత్వమే రైతులకు ప్రమాణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు ప్రమాణ పత్రం ఇవ్వాలనేది దిక్కుమాలిన పద్ధతి అన్నారు. డిక్లరేషన్ ద్వారా రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.
రైతులకు సంక్రాంతి లోపే రైతుబంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వద్దామని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు.

తమ హయాంలో ఇచ్చిన రైతుబంధు పక్కదారి పట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలు సరికాదన్నారు. 70 లక్షల మంది రైతులకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పలుమార్లు రైతుబంధు ఇచ్చామన్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లెక్కలు బయటపెట్టాలన్నారు.
రైతు భరోసాకు ప్రభుత్వం ఇదివరకే దరఖాస్తులు తీసుకుందని, ఇప్పుడు మరోసారి దరఖాస్తులు అడగడం ఏమిటని ప్రశ్నించారు. మీ ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. రైతును రాజుగా చేయాలన్నది తమ ఆలోచన అయితే… బిచ్చగాడిగా చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విమర్శించారు.