ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అంతా సీఎంను కలిసేందుకు ఈ నెల 17న అమరావతి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. ఇప్పటివరకూ తమకు పెండింగ్ ఉన్న జీతాల్ని చెల్లించలేదని, సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్తారని ఇప్పటివరకూ ఎదురుచూశామని వాలంటీర్లు తెలిపారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసింది. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతాలు రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన అధికార పార్టీలు.. ప్రభుత్వం వచ్చాక మాత్రం వారిని వదిలేశాయి. దీంతో అప్పటి నుంచీ నిరసనలు చేస్తున్న వాలంటీర్లు తాజాగా మరో వ్యూహం ఎంచుకున్నారు. దీనిపై నిన్న విజయవాడలో ప్రకటన చేశారు.

వాలంటీర్ల కొనసాగింపుకు అసలు ఈ వ్యవస్థను నియమిస్తున్నట్లు గత ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో మరి కొనసాగిస్తామని ఎలా హామీ ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే జీతాలు పెంచుతామని ఎలా చెప్పారని అడుగుతున్నారు. సంక్రాంతి సందర్భంగా అందరి బకాయిలు తీర్చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం తమ జీతాల బకాయిలు ఎప్పుడు తీరుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇవే అంశాలతో ఓ వినతిపత్రం తీసుకుని రేపు అమరావతిలో జరిగే ఏపీ కేబినెట్ భేటీకి వెళ్తామని, అక్కడ సీఎం చంద్రబాబుకు ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలంటూ ఓ వినతిపత్రం సమర్పిస్తామని వాలంటీర్లు వెల్లడించారు.