కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విభాగాల్లో ప్రక్షళన చేస్తున్నది. ఇందులో భాగంగా ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు అనుకున్నంత స్దాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య తీర్మానించింది. గుంటూరు బ్రాడీపేటలోని యుటిఎఫ్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె.అనురాధ, డాక్టర్ గురుస్వామి కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

రేషనలైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కలెక్టర్లు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడాలని నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆలస్యం చేయడం వల్ల నష్టపోయిన తొమ్మిది నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీ నుండి సర్వీసు లెక్కించి, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న డిఎలు ఇవ్వాలని సచివాలయాల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
సచివాలయాల్లో ఎఎన్ఎం, హెల్త్ సెక్రెటరీలకు యాప్ల పని భారం తగ్గించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అనేక రకాలైన సర్వేలు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరికాదని వారు చెప్తున్నారు.