కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్ల అమలు విషయంలో నిర్లక్ష్యం వహించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ పార్టీలు ప్రజలకు సరైన పాలనను అందించడంలో విఫలమైనాయని కవిత విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని, నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో కవిత పాల్గొని ప్రసంగించారు.
ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా..? మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు..? మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది అని కవిత గుర్తు చేశారు.

కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో ఆలోచించాలి. సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు… పులిబిడ్డ. మహిళా విద్యాకు ఎంతగానో కృషి చేశారు. ఎంతో మంది మహిళలకు చదువును నేర్పించారు సావిత్రీబాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారు అని కవిత ప్రశంసించారు.