కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నది జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మా నాయకులను జైల్లో పెట్టడమే పనిగా పెట్టుకుందని ఆమె విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని, ప్రజల హక్కుల కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రజా వాణిని వినిపిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కవిత ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. బోథ్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్, ఇతర బి.ఆర్.ఎస్ నాయకులు కవిత వెంట ఉన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను స్మరిస్తే ఉత్తేజం కలుగుతోందని అన్నారు. అదే స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాడుతామని అన్నారు.

రైతు భరోసాపై మాట తప్పింది
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం మాట తప్పిందని, రైతులకు 15 వేల రూపాయల ఇస్తామని ఇప్పుడు 12 వేలకు తగ్గించి ముఖ్యమంత్రి రైతులను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బిఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేస్తూ వేధిస్తోందని అన్నారు.