ఇటీవల పోలీస్ ఉద్యోగం చేయాలనే ఆశ చాలామందిలో కలుగుతున్నది. ఇందుకు కారణం మంచి జీతం, ఇతర అలవెన్సులు వుంటాయని భావన కావచ్చు. అయితే మనం అనుకున్నత సులభం కాదు పోలీస్ ఉద్యోగం అంటె. కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసినా.. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించినవారిలో చాలామంది ఫిట్నెస్ పరీక్షలకు వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షలు కఠినంగా ఉండటమే ఇందుకు కారణం. ఎప్పుడు రిక్రూట్మెంట్ నిర్వహించినా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు మరణిస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో ఒక అభ్యర్థి రన్నింగ్లో ప్రాణాలు వదలడం విషాదకరం. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు పాటించడం ఎందుకనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో ఉండేది కాదు. తగినన్ని వాహనాలు ఉండేవి కావు. దీంతో నేరస్తులను పట్టుకునేందుకు కానిస్టేబుళ్లకు వారికంటే దేహదారుఢ్యం, బలం ఉండాలని భావించేవారు. ఇప్పు డు సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. నేరాల తీరుతెన్నుల్లోనూ మార్పు వస్తోంది. ఎక్కడైనా ఘట న జరిగితే ఎస్ఐ లేదా ఇతర సిబ్బందితో కలసి టీమ్గా వెళ్తారు. ఇన్ఫార్మర్ల ద్వారా కూడా నేరస్తుల సమాచారం తెలిసిపోతుంది. అవసరమైన టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన వారి నుంచి పీఈటీ, పీఎంటీ పరీక్షలకు పీఆర్బీ ఆహ్వానించింది. అర్హుల్లో 77,510 మంది పురుషులు, 16,734 మంది మహిళా అభ్యర్థులు.. మొత్తం 94,244 మంది ఉన్నారు. గతేడాది డిసెంబరు 30న రాష్ట్రంలోని 13 కేంద్రాల్లో ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ప్రారంభమైంది. కఠినమైన ఎంపిక ప్రక్రియ నుంచి విధుల నిర్వహణలో సమస్యల వరకు ఎన్నో కారణాలతో ఈ ఉద్యోగంపై మక్కువ తగ్గిపోతున్నది అని నిరుద్యోగులు వాపోతున్నారు.