బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ మ్యాచ్లో నితీష్ రెడ్డి శతకం భారత్కు కొత్త ఊపును అందించింది.ఓ దశలో ఫాలో ఆన్ ఒత్తిడిలో ఉన్న భారత జట్టును, కేవలం 116 పరుగుల తేడాతో నిలిపి మ్యాచ్లో నిలబడేలా చేశాడు.మూడో రోజు ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.నితీష్ రెడ్డి 105 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు, అతనికి మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో తోడుగా ఉన్నాడు.తొలి సెంచరీని సాధించిన నితీష్, భారత జట్టును మ్యాచ్లో నిలిపాడు.మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో, ఈ టెస్ట్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో శనివారం భారత జట్టు 164/5 స్కోరుతో ఆటను కొనసాగించింది. రిషబ్ పంత్ 6 పరుగులు,రవీంద్ర జడేజా 4 పరుగులతో జట్టును ముందుకు నడిపారు.అయితే, ఆస్ట్రేలియా బౌలర్లు తమ ప్రతిభను చాటారు. మొదటి సెషన్లో రిషబ్ పంత్ 28 పరుగుల వద్ద ఔటవ్వగా,రవీంద్ర జడేజా 17 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఈ దశలో భారత జట్టు 221/7 స్కోరుతో నిలిచింది.
కానీ, ఇక్కడి నుంచి నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కలిసి మ్యాచ్ను మరింత గాడిలో పెట్టారు. నితీష్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఎనిమిదో వికెట్కు 285 బంతుల్లో 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఫాలో ఆన్ను తప్పించడంతో పాటు జట్టును గౌరవప్రద స్థితిలో నిలిపారు. వాషింగ్టన్ సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేయగా,చివరికి ఆయన ఔటయ్యాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలో మూడు వికెట్లు తీశారు.నాథన్ లియాన్ రెండు కీలక వికెట్లు తీసి భారత్పై ఒత్తిడిని పెంచాడు. కానీ,నితీష్ రెడ్డి సూపర్ ఇన్నింగ్స్,సుందర్ సహకారం ఫాలో ఆన్ బెడదను దూరం చేసింది.డిసెంబరు 27న ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ను 474 పరుగుల వద్ద ముగించింది.