Home » వాణిజ్యం » మళ్లీ మా వృద్ధి రేటు పెరుగుతుంది
మళ్లీ మా వృద్ధి రేటు పెరుగుతుంది
శని వారం, నవంబర్ 21, 2009 , 1:48 [IST]
వాషింగ్టన్ నవంబర్ 20:- ఇండియా జిడిపి మళ్ళీ తొమ్మిది శాతం చొప్పున అభివృద్ధి సాధించే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని అభివృద్ధిచెందిన దేశాల నుంచి వస్తున్న నిధుల ప్రవాహం వల్ల ఇది సాధ్యం అవుతుందని, త్వరలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా బాగా పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ వ్యక్తం చేసారు. వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో పారిశ్రామికులకు, వ్యాపార వేత్తలకు కొరతలేదని, అమెరికా విద్యా వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉన్నదని, అందువల్ల ఈ తాత్కాలిక ఆర్థిక మాంద్య సమస్యను అధిగమిస్తుందని పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తొలి అతిథిగా వచ్చే దేశాధినేత కానున్నారు. ఇండియా,అమెరికాల మధ్యకుదిరిన పౌర అణు ఒప్పందాన్ని అమలు చేయాలని అమెరికా కోరుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతున్నది. ఆర్థిక మాంద్యం వల్ల విదేశీ నిధుల ప్రవాహం తగ్గిందని అందువల్ల వృద్ధి రేటు మందగించిందని అయితే ఇటీవలి కాలంలో నిధుల ప్రవాహం పెరగడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు.
రెండు సంవత్సరాల్లో మళ్ళీ తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధిస్తామని చెప్పారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉన్నదని, వ్యర్థ ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి బ్యాంకింగ్ నిబంధనలు ఇండియాలో అనుమతిందని ఆయన స్పష్టం చేసారు. భారతీయ ప్రధానిగా తాను కొంత ప్రభావం చూపానని, అయితే దీనిపై తుది తీర్పు భవిష్యత్తు తరాలదేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యాఖ్యానించారు.