హైదరాబాద్, నవంబరు 6 : ఆస్ట్రేలియాపై సాధించిన 175పరుగులు తన కెరీర్లో ఉత్తమ ఇన్నింగ్స్లో ఒకటని, అయితే మ్యాచ్లో ఫలితం తనకు అసంతృప్తిమిగిల్చిందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్టెండూల్కర్ పేర్కొన్నాడు. తన ఇన్నింగ్స్ జట్టు విజయానికి దోహదం చేసుంటే తనకు ఎంతో తృప్తిగా ఉండేదన్నాడు. సచిన్ 141 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్లతో 175 పరుగులు చేసినప్పటికీ, 17 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వైఫల్యంతో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సెహ్వాగ్తో కలిసి తాను ఇన్నింగ్స్ను వేగంగా ప్రారంభించి, ఒక దశలో సురేష్రైనా భాగస్వామ్యంతో భారత్ను పటిష్ట స్థితి చేరుస్తున్న సమయంలో కీలకమైన వికెట్లు పడటం మ్యాచ్ చేజారిపోయేలా చేసిందన్నాడు.
పరుగుల దాహంతో అలమటించి పోయేవాడిలా ఫోర్లు, సిక్స్లతో విరుచుపడిన ఈ దిగ్గజం ఈ ఇన్నింగ్స్ తనదైన శైలిలో అత్యుత్తమ షాట్లు కొట్టానన్నాడు. 1988లో 16 ఏళ్ల బాలుడిగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి గత 20 ఏళ్లుగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తుండటం తనకు గర్వకారణమన్నాడు. అయిదో వికెట్కు తనతో కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సురేష్రైనాపై మాస్టర్ ప్రశంసలు కురిపించాడు. బంతికో పరుగుతో 59 పరు గులు చేసిన ఆ యువక్రికెటర్ భారత్ను విజయానికి చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. రైనా అద్భుతమైన ఆటగాడని, భారీ లక్ష్యచేధనలో ఒకవైపు ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ అతను అద్భుత ఇన్నింగ్స్ ఆడాడన్నాడు. హైదరాబాద్ వన్డేలో మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ నిలిచిన సచిన్టెండూల్కర్పై భారత్ కెప్టెన్ ధోని, ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు.
దిగ్భ్రాంతి కల్గించిన ప్రభాష్ జోషి మృతి ప్రముఖ క్రీడా పాత్రికేయుడు ప్రభాష్జోషీ మృతి పట్ల సచిన్ టెండూల్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. 72 ఏళ్ల జోషి గత రాత్రి హైదరాబాద్లో ఉత్కంఠ భరితంగా జరిగిన ఆస్ట్రేలియా-భారత్ అయిదో వన్డేను ఢిల్లీలో టివిలో వీక్షిస్తూ గుండెనెప్పికి గురయ్యా రు. కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు ప్రకటించారు. ఆయన మృతి వార్త తెలిసి షాక్ అయ్యానని, క్రికెట్ను లోతుగా పరిశీలించి రాసే ఆయన విశ్లేషణలు, అభిప్రాయాలు తాను తప్పక పాటించేవాడినని, ఆయన తనను ప్రోత్సహించారన్నాడు.
బిసిసిఐ ప్రతినిధి రాజీవ్శుక్లా జోషి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. నయీ దునియా పత్రికలో పాత్రికేయునిగా కెరీర్ ఆరంభించారు. ఇండియన్ఎక్స్ప్రెస్లో స్పోర్ట్స్రైటర్ పనిచేసిన ఆయన 1983లో ప్రముఖ హిందీ పత్రిక జనసత్తాకు ఫౌండర్ ఎడిటర్గా పనిచేశారు. 1995లో రిటైర్ అయిన నాటి ఆ పత్రికకు ఛీఫ్ ఎడిటోరియల్ ఎడ్వైజర్గా పనిచేస్తున్నారు. లోయర్ ఆర్డర్ లోపమే..: ధోని బ్యాటింగ్ లోయర్ ఆర్డర్లో ఆత్మస్థైర్యం లోపించడం, వారి అనుభవరాహిత్యమే ఉత్కంఠభరిత అయిదో వన్డేలో తమకు విజయాన్ని దూరం చేసిందని భారత్ కెప్టెన్ మహేంద్రసింగ్ధోని వ్యాఖ్యానించాడు. చివర్లో ఒకరిద్దరు ఆత్మస్థైర్యంతో ఆడి ఉండే మ్యాచ్ చేజారేది కాదన్నాడు. భారీ లక్ష్యాన్ని చేధించేటప్పుడు ప్రతి ఆటగాడు ఆత్మవిశాసంతో బరిలోకి దిగాలన్నాడు. ఉప్పల్ స్టేడియంతో ఆస్ట్రేలియాతో జరిగిన అయిదో వన్డేలో భారత్ 350 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాల్సిన క్రమంలో 347 పరుగులకే పరిమితమై ఓడింది.
ఈ మ్యాచ్లో అప్పుడే కెరీర్ ఆరంభించి, జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికా అన్నట్లు పరుగుల దాహంతో మాస్టర్ బ్లాస్టర్ చెలరేగి 141 బంతుల్లో 175 పరుగులతో భారత్కు విజయాన్ని చేరువ చేసి ఔటయ్యాడు. 17,000 పరుగుల క్లబ్లో చేరిన తొలి ఆటగాడిగా అతను వెనుదిరిగే సమయానికి భారత్ విజయానికి 17 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చివర్లో మిగిలిన ముగ్గురు బ్యాట్స్మెన్ ఒత్తిడి తట్టుకోలేక తడబడి 15 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్లతో తలపడినప్పటికీ తాము అన్ని విభాగాల్లో వారికి ధీటుగా రాణించామని, అయితే కీలకమైన ఒత్తిడి సమయాల్లో చేతులెత్తేయడంతో చారిత్రక విజయం దూరమైందని ధోని పేర్కొన్నాడు. టెండూల్కర్ అద్భుతంగా రాణించకపోతే తాము విజయానికి చేరువగా కూడా వచ్చే వారిమికామని అభిప్రాయపడ్డాడు. అయితే విజయానికి చేరువ అయ్యాక చేతులెత్తేయాల్సి రావడం పట్ట అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాపార్డర్లో ప్రధానమైన నలుగురిలో ముగ్గురు బ్యాట్స్మెన్ విఫలమైనప్పటికీ సచిన్ చలవతో తాము గెలుపుకు దగ్గరయ్యామని, సచిన్ ఔటైనప్పటికీ తమకు విజయంపై ఆశలు పోలేదన్నాడు. ఉప్పల్ పిచ్ ఎంత బ్యాటింగ్కు అనుకూలించినప్పటికీ, తమ బౌలర్లు అదనపు పరుగుల రూపంలో 20-30 పరుగులు సమర్పించుకోవడం కూడా పరాజయానికి ఒక కారణమన్నాడు.
ఆసీస్ను బౌలర్లు 325-30 పరుగులకు కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఈ మ్యాచ్ ఫలితం గౌహతిలో జరగనున్న ఆరో వన్డే సందర్భంగా తమపై ఎటువంటి ఒత్తిడి పెంచబోదన్నాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పోరాట పటిమను ప్రశంసించన ధోని, 3 కీలక క్యాచ్లను తాము జారవిడవటం కొంపముంచిందన్నాడు. 112 పరు గులు సాధించిన మార్ష్ తన వ్యక్తిగత స్కోర్లు 29, 51 వద్ద ఇచ్చిన క్యాచ్లను భారత్ అందుకోలేకపోయింది. ఏదిఏమైనా ఈ మ్యాచ్తో సచిన్పై అభిమానం మరింత పెరిగిందని ధోని వెల్లడించాడు. పాంటింగ్ ప్రశంసల జల్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్పై ఆస్ట్రేలియా కెప్టెన్ రికీపాంటింగ్ ప్రశంసల జలు కురిపించాడు. గురువారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సచిన్ బ్యాటింగ్ చేసిన తీరు ఎన్నటికీ మరిచిపోలేనని, తాను ఇప్పటి వరకు చూసిన ఇన్నింగ్స్లలో సచిన్దే అద్భుతమైందని ప్రశంసించాడు. భారీ లక్ష్య చేధనలో 175 పరుగుల వ్యక్తిగత స్కోరుతో సచిన్ భారత్ను విజయానికి చేరువ చేశాడు. 17 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో సచిన్ ఔటవ్వడం, అనంతరం ఎవరూ నిలదొక్కుకోక పోవడంతో 347 పరుగులకు ఆలౌట్ అయిన భారత్3 పరుగుల తేడాతో ఓడింది. ఒక్క తప్పుడు షాట్ కొట్టినా బ్యాట్స్మన్ పెవిలియన్కు చేరవలసిందేనని, అయితే అయిదో వన్డేలో మెరుపువేగంతో ఆడిన సచిన్ ఖచ్చితంగా బంతి గమనాన్ని అంచనా వేసి ఆడటం ఆకుట్టుకుందని పాంటింగ్ పేర్కొన్నాడు.
తమ జట్టులో షాన్మార్ష్, వాట్సన్లు అద్భుతంగా ఆడారని, అయిదో వన్డేలో విజయం జట్టులోని యువ ఆటగాళ్ల సమష్టి కృషి ఫలితమన్నాడు. ఈ మ్యాచ్లో మార్ష్ వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేయగా, వాట్సన్ 93 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీస్కోరు సాధించింది. అంతర్జాతీయ క్రికెట్కు కొత్త ముఖమైన మెకే 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఉప్పల్లో పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై తాము 350 పరుగులు చేయడం సంతృప్తినిచ్చిందన్నాడు.
సచిన్ చెలరేగడంతో మ్యాచ్ తమ చేజారుతుందని ఆందోళన చెందినప్పటికీ, జట్టులోని యువ బౌలర్లు సరైన సమయంలో రాణించి విజయాన్ని కట్టబెట్టారన్నాడు. ఈ 7వన్డేల సిరీస్లో ఆసీస్కు అయిదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వారిస్థానంలో ఆఖరి నిముషాల్లో అందుబాటులోకి వచ్చిన యువకులు భారత్ పరిస్థితులకు అలవాటుపడి గాడిలో పడటం సంతోషంగా ఉందన్నాడు. సిరీస్లో 3-2 ఆధిక్యం సాధించనప్పటికీ ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండటంతో తమ పని పూర్తి కాలేదన్నాడు.
సంతోషంగా ఉంది: మార్ష్ భారత్పై తన తొలి శతకం నమోదు కావడం, విజయంలో తన వంతు పాత్ర సమర్ధంగా పోషించగలగడం సంతోషంగా ఉందని ఆసీస్ ఓపెనర్ మార్ష్ తెలిపాడు. తటస్థ వేదికైన దుబా§్ులో పాకిస్థాన్తో జరిగిన సిరీస్లో గాయపడ్డ మార్ష్ ఆరు నెలల అనంతరం భారత్ సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. ఆరు నెలల తర్వాత జట్టులో చేరినప్పటికీ తాను ఫాంను అందిబుచ్చుకోవడం సంతృప్తిగా ఉందన్నాడు. మార్ష్ తండ్రి జెఫ్మార్ష్ కూడా వన్డేలో తన తొలి శతకాన్ని భారత్పైనే నమోదు చేయడం విశేషం. అయిదో వన్డే జరిగిన గురువారాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని, తన తండ్రి కూడా భారత్పైనే తొలి సాధించడం గర్వంగా ఉందని షాన్ మార్ష్ పేర్కొన్నాడు.