ముంబయి నవంబర్ 5:- ఈసంవత్సరం ఖరీఫ్ సీజన్లో రుతుపవనాలు జాప్యం కావడం, తర్వాత వరదలు రావడం వల్ల నూనె గింజల ఉత్పత్తి తొమ్మిది శాతం పడిపోవచ్చునని అంచనా. విస్తీర్ణం తగ్గడమేకాకుండా దిగుబడి కూడా తగ్గింది. విస్తీర్ణం ఐదు శాతం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. సాల్వేంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం నాడు ఇండోర్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఖరీఫ్ సీజన్లో నూనెగింజల దిగుబడి 15.03 మిలియన్ టన్నుల నుంచి 13.65 మిలియన్ టన్నులకు పడిపోతుందని అంచనా. ఖరీఫ్ సీజన్లో మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో 62 శాతం జరుగుతుంది.
తవుడు నుంచి తీసే నూనె ఉత్పత్తి కూడా 50వేల టన్నులు తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే పత్తిరంగంలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. పత్తి ఉత్పత్తి ఆరు శాతం పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. 2008-09 సంవత్సరంలో 288 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే ఈ సంవత్సరం 305 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి కావచ్చునని అంచనా. దేశంలో బిటి కాటన్ విస్తీర్ణం గత సంవత్సరం 65 శాతం ఉంటే ఈ సంవత్సరం 87 శాతం ఉంది. పత్తి గింజల ఉత్పత్తి 8.93 మిలియన్ టన్నుల నుంచి 9.46 మిలియన్ టన్నులకు చేరునున్నది.